కందులవారిపల్లెలోని చంద్రబాబు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు!

  • ఇంటి కాపలాదారు ఫిర్యాదుతో వెలుగులోకి
  • సీసీటీవీ కెమెరాలు చూసి బయటకు వచ్చిన పోలీసులు
  • పొరపాటున వెళ్లారన్న సీఐ
చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసులమని కాపలాదారుకు చెప్పి లోపలికి వెళ్లారు. అయితే, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండడంతో మళ్లీ బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.

అనంతరం హైమావతి ఇంటి కాపలాదారు రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు సందర్భంగా సీసీటీవీ పుటేజీలను పోలీసులకు రవి అందించాడు. ఈ ఘటనపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అయితే తమ సిబ్బంది పొరపాటున నారావారిపల్లెకు కాకుండా కందులవారి పల్లెకు వెళ్లారని అన్నారు. హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు.

Chandrababu
TDP
Hymavathi
Kandulavaripalle

More Telugu News